వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ గూండాల దాడితో భయాందోళనలకు గురైన సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అంబటి నివాసంపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
తిరుపతి లడ్డూ ప్రచారాన్ని అడ్డుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, అంబటిపై దాడి యత్నం, అనంతరం ఆయన అరెస్ట్—ఈ పరిణామాలు ప్రభుత్వ తీరుపై విమర్శలకు దారి తీశాయి. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్ దాడి జరగడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ గుంటూరులో అంబటి కుటుంబాన్ని కలుసుకుని ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. ఇప్పటికే దాడులకు గురైన పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.


