ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్న మంచు మనోజ్ నటించిన చిత్రం ‘భైరవం’ ఈ నెల 30వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కు మంచి స్పందన వచ్చినా, దానికి సంబంధించిన లాంచ్ ఈవెంట్లో దర్శకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో ‘బాయ్కాట్ భైరవం’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా దర్శకుడిపై విరుచుకుపడ్డారు.
వివాదం ఎందుకు?
ఈ విమర్శలకు కారణం—దర్శకుడు విజయ్ గతంలో తన ఫేస్బుక్లో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేయడం. ఈ విషయం మళ్లీ బయటకు వచ్చి వైరల్ అవటంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే అనంతరం విజయ్ క్షమాపణ చెప్పడంతో వివాదం కొంత తగ్గింది.
మనోజ్ స్పందన
నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. “విజయ్ అన్న మెగా ఫ్యామిలీ గురించి నెగటివ్గా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానిని అంటే, ఆయన వాట్సాప్ డీపీ కూడా పవన్ గారిదే ఉంటుంది,” అని చెప్పిన మనోజ్, ఈ వ్యాఖ్యలు రాజకీయ పరంగా కాకుండా, కేవలం అభిమాని స్థాయిలో చేసిన వ్యాఖ్యలేనని స్పష్టం చేశారు.
కులాలపై మనోజ్ వ్యాఖ్యలు వైరల్
ఈ వేళ మనోజ్ చేసిన మరో కామెంట్ ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చింది. “ఇప్పుడు 2025లో ఉన్నాం, ఇంకా కులాల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. చదువు విలువ ఏమైంది? నేను చార్మినార్ని ఇష్టపడతాను అంటే తాజ్ మహల్ని కాదు అన్నట్లు కాదు. రెండు బావుంటే రెండు ఒకే కులానికి చెందినవని ఎలా అంటారు?”
అలాగే, “ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి వారిని మనం కులం చూసి అభిమానిస్తున్నామా? మనది ప్రేమికులం, నా కులం అదే. సినిమాలకు కులాలకు లింక్ పెట్టకండి,” అని గట్టిగా చెప్పారు.
ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీశాయి. మంచి పాయింట్ చెప్పారు అంటూ పలువురు మంచు మనోజ్కు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది ఆయన వ్యాఖ్యలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ‘భైరవం’ సినిమాకు ఈ వివాదం ఎంతవరకు బెనిఫిట్ చేస్తుందో చూడాలి!