“నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు” అంటూ ధీమాగా తిరిగే చంద్రకాంత్ చౌదరి మరోసారి తన అరాచక స్వభావాన్ని ప్రదర్శించాడు. ‘సీమరాజా’ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈయన బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్లో ఓ హింసాత్మక ఘటనకు కారణమయ్యాడు. మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులను రోడ్డుపై అడ్డగించి చితకబాదిన చంద్రకాంత్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్లి అక్కడే మరోసారి వారిపై దాడికి దిగడం తీవ్ర సంచలనంగా మారింది.
ఘటన వివరాల్లోకి వెళితే – తన కారు ముందు నుంచి వాళ్లు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో రోడ్డుపైనే యువకులపై దాడి చేశాడు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ కోసం చంద్రకాంత్ను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కానీ అక్కడే, పోలీసుల సమక్షంలోనే మరోసారి బాధితులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
పోలీసుల కళ్లముందే జరగిన ఈ దాడిపై స్థానికులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీస్స్టేషన్లో జరుగుతున్న ఈ చర్యల మధ్య, పోలీసుల నిర్వీర్యతపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇది పోలీస్ స్టేషనా లేక చంద్రకాంత్ చౌదరి వ్యక్తిగత కార్యాలయమా?” అనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి.
ఈ ఘటనపై బాధితులు మద్యం మత్తులో ఉన్న చంద్రకాంత్ దాడి చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు పోలీసులు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసకపోవడం, ఆయన చెప్పిన “నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు” అనే మాటలతో అధికారులు భయపడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ప్రజలు ఇప్పుడు పోలీసుల తీరుపై ప్రశ్నలు వేస్తున్నారు. చంద్రకాంత్ దురుసుతనాన్ని నిలువరించేందుకు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైరల్ వీడియో ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా చెబుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై దృష్టి కేంద్రీకృతమైంది. పోలీసుల నిష్క్రియతపై ప్రజల్లో ఆక్రోశం, అధికార యంత్రాంగం స్పందనపై ఆసక్తికరంగా మారింది.