ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ ‘వెన్నుపోటు దినోత్సవం’ నిర్వహించింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది. సామాన్యులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశం ట్రెండింగ్ అయ్యింది.
ప్రతిరోజూ సాయంత్రం టీవీ డిబేట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేసే ఛానెళ్లు, నిన్నటి ‘వెన్నుపోటు దినోత్సవం’ విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాయి. ఈ మొత్తం పరిణామాన్ని ఎలా కవర్ చేయాలో, ఏ కోణంలో డిఫెండ్ చేయాలో తెలియక తమ స్టూడియోల్లోనే తలలు పట్టుకుని కూర్చున్నారట. టీఆర్పీ కోసం చేసే అరుపులు, విమర్శలు ఈసారి పనిచేయలేదు.
“రోజూ వైసీపీని తిడుతున్నాం… అయినా ఒక్కరూ నమ్మడం లేదు. ఈ ప్రజలు నిజంగా మారిపోయారేమో!” అంటూ కొందరు జర్నలిస్టులు వాపోతున్నారని సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఏ పార్టీ, ఏ మీడియా నిజం చెబుతుందో తెలుసుకునే స్థాయికి వచ్చారని ఇది స్పష్టం చేస్తోంది.
ప్రజల మద్దతు ఎవరికి ఉందో ‘వెన్నుపోటు దినోత్సవం’ స్పష్టం చేసింది. పతన మార్గంలో ఉన్న ఎల్లో మీడియా ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంగా విమర్శలు చేయడం సహజమే, కానీ అవి వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. ఎజెండాలతో, పక్షపాత కవరేజీతో ప్రజలను మోసం చేయాలనుకునే మానసికతను ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇకపై ప్రజల మనసులు గెలవాలంటే నిజాయితీతో కూడిన జర్నలిజం చేయడం తప్ప ఎల్లో మీడియాకు మరో మార్గం లేదు.