అమరావతి మహిళా రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఏపీ పోలీసులు కఠినంగా స్పందించారు. ఈ వివాదంలో భాగంగా మీడియా విశ్లేషకుడు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన “అమరావతిలో వేశ్యలు ఉన్నారు” అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. సాక్షి యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని వ్యవస్థీకృత కుట్రగా అభివర్ణించారు.
అరెస్టుల ప్రక్రియ ప్రారంభం
ఈ ఉదంతంతో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్లోని జర్నలిస్టుల కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరోవైపు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన కూడా త్వరలోనే అరెస్టయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సాక్షి మీడియా నిశ్శబ్దం
ఈ వివాదంపై ఇప్పటివరకు సాక్షి మీడియా నుంచి స్పందన రాలేదు. మీడియా యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జర్నలిస్టు కృష్ణంరాజు మాత్రం స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలు తప్పుడు దిశలో వివరణ చెబుతూ అమరావతి కాకుండా ఆ ప్రాంత పరిసరాల గురించి మాత్రమే చెప్పానని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందిస్తూ వీరి వ్యక్తిగత వ్యాఖ్యలకు తమ పార్టీకి, సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
జర్నలిస్టు సంఘాలు మౌనం
కొమ్మినేని అరెస్ట్పై ఇంకా జర్నలిస్టు సంఘాల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
కొమ్మినేనికి సుదీర్ఘ అనుభవం
కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగు మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం కలవారు. ఈనాడు, ఇతర ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఇటీవల కాలంలో సాక్షి ఛానల్లో యాంకర్గా, విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు చాలాసార్లు వినిపించాయి. తాజాగా అమరావతి అంశంలో చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఆగ్రహానికి దారి తీశాయని విశ్లేషణలు ఉన్నాయి.