టీవీ5 ఛానల్లో యాజమాన్య మార్పులు కలకలం రేపుతున్నాయి. ఈ మార్పులకు కారణం ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు తాజా నిర్ణయాలు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవిని స్వీకరించిన ఆయన, టీవీ5లో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఛానల్ మొత్తం పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు.
ప్రతి విభాగానికి ప్రత్యేక అధిపతులను నియమించారు. తాజా నియామకాల్లో ముఖ్యమైనది మూర్తిని సీఈఓగా ఎంపిక చేయడం. ఎప్పటినుంచో టీవీ5లో డిబేట్స్ నిర్వహిస్తున్న మూర్తికి ఇదొక పెద్ద పదవిగా భావించవచ్చు. గతంలో ఏబీఎన్, ఎన్టీవీల్లో పని చేసిన అనుభవం ఉన్న మూర్తి.. ఇప్పుడు టీవీ5లో ప్రధాన బాధ్యతలు చేపట్టనున్నాడు.
అలాగే రావిపాటి విజయ్ను న్యూస్ డైరెక్టర్గా ఎంపిక చేశారు. బిజినెస్ న్యూస్లో ప్రత్యేక అనుభవం ఉన్న విజయ్కి ఈ పదవి లభించడం ఆశ్చర్యం కాదని వర్గాలు చెబుతున్నాయి. నిశితంగా, ప్రశాంతంగా వార్తలు చెప్పే నైపుణ్యం ఆయనకు ఉంది. పైగా బీఆర్ నాయుడికి అత్యంత నమ్మకమైనవారు కూడా కావడంతో ఈ అవకాశం దక్కింది.
డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్గా బలవంత్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్గా శ్రీనివాసమూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్గా అనిల్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం ఐదు కీలక విభాగాలకు ఐదుగురు బాధ్యతలు తీసుకోవడంతో టీవీ5ను మరింత పటిష్ఠం చేయాలన్న లక్ష్యంతో నాయుడు ముందడుగు వేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టీవీ9 మొదటి స్థానంలో, ఎన్టీవీ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీలో రెండో స్థానాన్ని దక్కించుకోవాలన్న దృష్టితోనే టీవీ5 యాజమాన్యం ఈ మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్యలు ఎంత మేర ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.
ఈ మార్పుల నడుమ టీవీ5లో సుదీర్ఘకాలంగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావుకు మాత్రం ఎటువంటి కీలక పదవి ఇవ్వలేదని సమాచారం. గతంలో ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత కొంతకాలం టీవీ5కి దూరమైన ఆయన ఇటీవలే మళ్లీ ప్రైమ్ టైం డిబేట్స్ ద్వారా తెరపైకి వచ్చారు. కానీ తాజా బాధ్యతల కేటాయింపులో ఆయనకు చోటు లేకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. భవిష్యత్తులో ఆయనకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.