అమరావతి అంశంపై చేసిన వ్యాఖ్యల కేసులో యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియా డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ హోదాలో ఉన్న కొమ్మినేనిని అరెస్ట్ చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధాని మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన మరచిపోకముందే, తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సజ్జల వ్యాఖ్యలు, ఆపై ఫిర్యాదు:
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనను నిరసిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గత రెండు రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారిచ్చిన ఫిర్యాదుతోనే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ జరగగా, అమరావతి మహిళా రైతుల నిరసనను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు?
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కుల వివక్షకు సంబంధించిన పదప్రయోగం చేస్తూ సజ్జల దూషణలకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశారని, సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు. భవిష్యత్తులో అలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందా?
అయితే, వరుసగా అమరావతి రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం కుట్రపన్ని కేసులు పెడుతోందని వైకాపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా “సూపర్ 6” పథకాన్ని ఎగ్గొట్టే కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కొమ్మినేనిని, నేడు సజ్జలను అరెస్ట్ చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చ కుట్రగా ఇది కనిపిస్తుందని వైకాపా శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.