ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న “తల్లికి వందనం” పథకంలో భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది. గణాంకాల ప్రకారం ఎంతో మంది మహిళలకు వాస్తవానికి సాధ్యం కాని సంఖ్యలో పిల్లలుగా జాబితాల్లో నమోదు చేసినట్టు తెలిసింది. ఇది పెద్ద స్థాయి అవినీతి అనుమానాలను కలిగిస్తోంది.
ధర్మవరం ప్రాంతానికి చెందిన మౌనిక అనే మహిళ పేరు మీద ఏకంగా 80 మంది పిల్లల పేర్లు నమోదు చేసినట్టు సమాచారం. ఇదే ప్రాంతానికి చెందిన దాసరి శోభ అనే మహిళ పేరు మీద 69 మంది పిల్లల పేర్లు ఉన్నట్టు జాబితాలో ఉన్నాయని తెలిసింది. ఈ గణాంకాలు నమ్మశక్యంగా లేవు. సాధారణంగా ఓ మహిళకు ఇంత ఎక్కువ మంది సంతానం కలగడం అసంభవం.
అంతేకాదు, హంపమ్మ అనే మహిళ ఆధార్ కార్డు మీద 94 మంది పిల్లలు ఉన్నట్టు జాబితాలో నమోదైంది. ఇదే విధంగా, బేస్త సుజాత అనే మహిళకు 40 మంది పిల్లలు ఉన్నట్టు నమోదు చేశారు. ఈ వివరాలు చూసిన ప్రతిఒక్కరికీ ఆశ్చర్యం కలిగించక మానదు.
ఈ అంశంపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. పథకాన్ని నిర్వాహకులు ఎలా నిర్వాహించారు? ఎవరి ఆధ్వర్యంలో ఈ తప్పుడు డేటా సమీకరణ జరిగింది? అనే అంశాలపై సమగ్ర విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పథకానికి అనర్హులైన వారు లబ్ధిదారులుగా మారి ప్రభుత్వ నిధులను దోచుకున్నట్టు భావిస్తున్నారు.
ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశముంది. నిజమైన లబ్ధిదారులకు ఈ కారణంగా న్యాయం జరగకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలి అనే డిమాండ్ ప్రజల్లో పెరుగుతోంది. దీనివల్ల పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గిపోకుండా చూడాలని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సత్యం ఎప్పటికీ వెలుగు చూస్తుంది… కానీ ఈ కుట్ర ఎవరి పన్నాగమో త్వరలోనే బయటపడనుంది అని భావిస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి