గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గురువారం ఉదయం జరిగిన భారీ విమాన ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ప్రయాణికుల విమానం నగరంలోని ఎయిర్పోర్టు సమీపంలో కుప్పకూలింది. అందులో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి శ్రమించాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా, భారీ ప్రాణనష్టం జరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణించినట్టు సమాచారం. ప్రమాదంలో ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. విజయ్ రూపానీతో పాటు మరికొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ విమానంలో ఉన్నట్టు సమాచారం. వారందరిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారని అధికారులు తెలిపారు.
ఈ ఘోర ఘటనకు సంబంధించిన కొన్ని షాకింగ్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రమాద స్థలంలో బాధితుల కుటుంబసభ్యుల రోదనలు, శోకసంద్రంలో మునిగిన ప్రజలు కనిపిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సంబంధిత శాఖలు తెలిపాయి.
ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర విచారం తెలిపారు.