ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది ఇదే తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన చేపట్టారు. ఇప్పటివరకు ‘సూపర్ 6’ హామీలను అమలు చేసినప్పటికీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి.
రైజ్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. గతంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని హెచ్చరించింది. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ పుల్లట వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2024 ఎన్నికల్లో వీటిలో 32 చోట్ల టీడీపీ కూటమి గెలిచింది. వైసీపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. పార్లమెంట్ స్థానాల విషయంలోనూ కూటమి విజయ పరంపర కొనసాగింది.
అయితే తాజా సర్వేలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. 32 మంది కూటమి ఎమ్మెల్యేలలో 17 మందిపై అసంతృప్తి ఉందని, ఇందులో 9 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని రైజ్ సర్వే పేర్కొంది. ఈ వివరాలను ప్రవీణ్ పుల్లట తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు హింట్ ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల సర్వే వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సంస్థ తెలిపింది.
ఈ సర్వే ఫలితాలు కూటమి వర్గాల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. గతంలో అనుకూల ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటించడం గమనార్హం. మరింతగా ఆలోచన కలిగించే అంశం.
ఇదిలా ఉండగా, ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై అధికార పార్టీ అంతర్గతంగా కూడా సమీక్ష మొదలైంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు పంపినట్లు సమాచారం.
మొత్తం మీద ఈ సర్వే ఫలితాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారినట్టు స్పష్టమవుతోంది.