వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లకు వెళ్లే మార్గంలో గుంటూరులో అపూర్వ స్వాగతం లభించింది. గుంటూరు రోడ్లన్నీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడాయి. అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం మధ్య జగన్ కాన్వాయ్ నెమ్మదిగా కదిలింది.
చుట్టుగుంట సెంటర్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జగన్కు ఘన స్వాగతం పలికారు. గుంటూరులోకి ప్రవేశించి గంటన్నర దాటినా, వై.ఎస్. జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టమైంది. వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్కు జగన్ చేరుకున్నారు. మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి.
సత్తెనపల్లి, జూన్ 18: వై.ఎస్. జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం పోలీసులమయంగా మారింది. ఆంక్షల పేరుతో వైఎస్సార్సీపీ కేడర్ను పోలీసులు ఇబ్బంది పెట్టారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. అయితే, జగన్ పర్యటనలో ఎక్కడా పోలీసులు కనిపించకపోవడం గమనార్హం.
జగన్ కాన్వాయ్కు రోడ్డు క్లియర్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్ కాన్వాయ్కి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ కనిపించలేదు. కాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై ఖాకీలు కనిపించకపోవడంతో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని వంటివారు జగన్ కాన్వాయ్కి ముందు పరుగెత్తుతూ రోడ్ క్లియర్ చేయాల్సి వచ్చింది.
వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే పేరేచర్ల జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ భారీ జనసందోహంతో పేరేచర్ల కిటకిటలాడింది. “జై జగన్, జైజై జగన్” నినాదాలతో జంక్షన్ మార్మోగింది. అందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు.
కాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వై.ఎస్. జగన్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో కూడా జగన్ పాల్గొన్నారు. విగ్రహం వద్ద నాగమల్లేశ్వరరావు తల్లి కంటతడి పెట్టుకున్నారు. పరామర్శకు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.