ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. “ఓటేసిన వారికి.. ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతానికి సంక్షేమం, అభివృద్ధి, పనులు చేయడం కరెక్ట్” అని, “ఓటు వేయని వైసీపీ నేతలకు, ఆ ప్రాంతాల వారికి పనులు చేసి వృథా” అని చంద్రబాబు అన్న వీడియో వైరల్ అయ్యింది.. “ఓటు వేయని వారికి ఎందుకు పనిచేయాలి? ఓటు వేసిన వారికి వేస్తే ప్రయోజనం.. వారికి ప్రియారిటీ ఇవ్వాలి” అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. “ఏ రాజ్యాంగ నియమం చెప్పింది మాకు ఓటు వేసిన వాళ్ళకే పని చేయాలి అని? ఇదేనా 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు గారు?” అంటూ నెటిజన్లు ఆయనను నిలదీస్తున్నారు. తమకు ఓటు వేసిన వారికే పనులు చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలందరికీ సమానంగా సేవ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనికి భిన్నంగా, గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పలువురు గుర్తు చేసుకుంటున్నారు. “నాకు ఓటు వేయకున్నా పర్వాలేదు.. వాళ్లు పేదలు, అర్హులు అయితే వారికి సంక్షేమం, అభివృద్ధి ఖచ్చితంగా ఇవ్వాలి” అని జగన్ గతంలోనే పిలుపునిచ్చారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలనేది ఆయన విధానంగా ఉంది.
ప్రస్తుతం చంద్రబాబు, జగన్ల వీడియోలను పోల్చుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. జగన్ను “నిజమైన లీడర్” అని అభివర్ణిస్తూ, చంద్రబాబును “అచ్చం స్వార్థ రాజకీయ నాయకుడు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓట్లు వేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామనడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తగదని, ప్రజలందరి సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.
ప్రజాస్వామ్యంలో పాలకుడు ప్రజలందరికీ ప్రథమ సేవకుడు కావాలి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. మరి ఈ భిన్న వాదనలపై మీ అభిప్రాయం ఏమిటి? ఒక ముఖ్యమంత్రి కేవలం తమకు ఓటు వేసిన వారి కోసమే పనిచేయాలా, లేక ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడాలా?
వీడియో కోసం క్లిక్ చేయండి