సినీ నటుల జీవితాలు విలాసవంతమైనవిగా మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. సినీ పరిశ్రమలో విజయం సాధించిన వారికి కలలో కూడా ఊహించని జీవితం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అయితే, ఇక్కడ సక్సెస్ కాకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సినీ నేపథ్యం ఉన్నవారు సక్సెస్ కాకపోయినా వేరే వ్యాపారం చూసుకుంటారు. కానీ ఆర్థిక స్థోమత లేక, కేవలం అదృష్టం కలిసొచ్చి ఒకే ఒక్క సినిమాలో అవకాశం వచ్చి, ఆ పాత్ర బాగా పాపులర్ అయి, తద్వారా మరికొన్ని సినిమాల్లో అవకాశాలు పొంది, ఆ తర్వాత మళ్ళీ ఫేడవుట్ అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మన పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరికైతే పూట గడవటం కూడా కష్టంగా మారింది. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ నటి పాకీజా.
‘పెద్ద రాయుడు’ చిత్రంతో పాకీజా పాత్ర ఆ రోజుల్లో బాగా హైలైట్ అయింది. ఈ పాత్రను పోషించిన నటి పేరు వాసుకి. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఏదైనా పని చేసుకుందామంటే పని ఇచ్చేవారు కూడా కరువయ్యారు. దీంతో ఆమె పూట గడవలేని స్థితిలో పడింది. ఆమె దయనీయమైన పరిస్థితిని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గతంలో ఆర్థిక సాయం చేశారు. అయితే, ఆ మొత్తాన్ని ఆమె తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించారు. ఇప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసేందుకు గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతూ, “నా దుస్థితిని తమిళ సినీ పరిశ్రమ అస్సలు పట్టించుకోలేదు. ఎంతో మందిని కలిసే ప్రయత్నం చేసినా సహాయం అందలేదు. నా గురించి తెలుసుకొని చిరంజీవి, నాగబాబు ఆదుకున్నారు. కానీ ఇప్పుడు మరింత దయనీయమైన స్థితికి వచ్చాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రతీ నెలా పింఛను వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పటి నటి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాటలను బట్టి చూస్తే ఆమె తమిళనాడుకు చెందిన మహిళగా అనిపిస్తుంది, తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా కాదు. కాబట్టి ఆమెకు ఆంధ్రప్రదేశ్లో ఉండే పథకాలు పొందే అర్హత ఉండకపోవచ్చు. అయితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆమెకు ఏదో ఒక విధంగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి.