ఏపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా “తల్లికి వందనం” పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 చొప్పున జమ చేసింది. అయితే, అందులో రూ.2,000 పాఠశాల అభివృద్ధి నిధిగా కలెక్టర్ అకౌంట్లోకి మళ్లించనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తించడంతో చాలా కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో నలుగురు పిల్లలు ఉన్న కుటుంబాలకు ఈ పథకం అమలై మంచి ప్రయోజనం చేకూరింది.
అయితే కొన్ని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో కొన్ని కొత్త నిబంధనలు, ఆంక్షలు అమలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
వైసీపీ హయాంలో అమలైన ‘అమ్మ ఒడి’ పథకం స్థానంలో ఈ పథకం ప్రవేశపెట్టారు. 2019లో జగన్ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పేరిట రూ.13,000 చొప్పున మంజూరు చేసింది. అయితే అప్పట్లో ఒక్కింటికి ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ ప్రయోజనం ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” వర్తింపజేసింది. గత విద్యా సంవత్సరం ఈ పథకం అమలు కాలేదు. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే అమలు చేసి, ఒక్కసారిగా గత సంవత్సరం నగదును కూడా విడుదల చేశారు.
అయితే మార్గదర్శకాల విషయంలో ప్రజల్లో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. వైసీపీ హయాంలో ఉండే నిబంధనలే ఇప్పటికీ కొనసాగించడంతో పలు వర్గాలకు ఈ పథకం అందలేదు. 300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం, నాలుగు చక్రాల వాహనాల కలిగివుండడం, ఆదాయ పన్ను కడుచుండటం, ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు ఉండడం లాంటి నిబంధనలు ఉన్నవారు మళ్లీ అనర్హులయ్యారు.
ఇంకా, సాంకేతిక లోపాల కారణంగా కొన్ని కుటుంబాలకు సాయం అందకపోవడంతో, జూన్ 21 నుంచి 28 వరకు అప్లికేషన్ల సవరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘సూపర్ 6’ పథకాలలో “తల్లికి వందనం” కీలకమైంది. ఇది ఏడాదిగా ప్రజల్లో ఆసక్తి రేపింది. అయితే ఈ పథకం పూర్తిగా అమలయ్యేంత వరకు ప్రజల్లో అసంతృప్తి కొంతకాలం కొనసాగేలా ఉంది.
ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ నెలలోనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటంతో పథకాల అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో కూటమి ప్రభుత్వం ప్రజలలో నెమ్మదిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.