పాత్రికేయులు నిజాయితీగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తే సమాజానికి మేలు. కానీ నేటి రాజకీయ వాతావరణంలో పాత్రికేయత కూడా వాణిజ్యమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. పాత్రికేయ రంగంలోకి వ్యాపారులు ప్రవేశించడం వల్ల వారు లాభనష్టాల లెక్కలే చూసే స్థితికి వచ్చింది.
ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు సంబంధించి రాధాకృష్ణ (ఆర్కే) వ్యవహార శైలి దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఒకప్పుడు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ పత్రిక, ఇప్పుడు స్థిరంగా లాభాల్లో నడుస్తోంది. ఇది ఎలా సాధ్యమైందో అనే అంశాన్ని పక్కన పెడితే, ప్రతి ఆదివారం ‘కొత్త పలుకు’ శీర్షికలో ఆర్కే తాను చేస్తున్న రాజకీయ విశ్లేషణలు మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
తాజాగా ఆయన చేసిన విశ్లేషణలో చంద్రబాబును మళ్లీ పొగడ్తలతో ముంచెత్తారు. టిడిపి నాయకత్వం త్వరలోనే లోకేష్కి అప్పగించాలన్న దిశగా సలహాలు ఇచ్చారు. చంద్రబాబు వయసు మీద పడుతోందని, ఆరోగ్యం బాగున్నప్పుడే బాధ్యతలు సమర్పించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాదు, పార్టీ భవిష్యత్తు పూర్తిగా లోకేష్పై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.
అయితే రాధాకృష్ణ ఇలా లోకేష్ను ప్రోత్సహిస్తుండటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ను వ్యంగ్యంగా టార్గెట్ చేయడంలోనూ తడబాడటం లేదు. గతంలో ఎన్టీఆర్ తో ఏదో దురభిప్రాయం జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ఎప్పటికప్పుడే చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆర్కే తన వ్యాసాల్లో ఎన్టీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించటం చూస్తే, ఆయనలో ఉన్న అసహనం బయటపడుతోంది. ఎన్టీఆర్ పార్టీని ‘హైజాక్’ చేస్తాడన్న ఆందోళనతోనే లోకేష్కి ముందస్తుగా నాయకత్వం ఇవ్వాలని చెబుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇది కేవలం రాజకీయ విశ్లేషణేనా? లేక వ్యక్తిగత అభిప్రాయాల కలబోతతో తయారైన ప్రణాళికా వ్యాసమా? అన్నది పాఠకులే నిర్ణయించాలి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే – కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లోపలి విభేదాలపై ఆమె చేస్తున్న ప్రశ్నల్ని ఆర్కే హైలైట్ చేశారు. కానీ ఇలాంటి పరిస్థితి ఒకవేళ టిడిపిలో జరిగినా, ఆర్కే అంతే ధైర్యంగా ప్రశ్నించేవారా? అనే ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఆర్కే వ్యాసం ప్రారంభంలో “పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఉండాలి” అని చెప్పిన మాటలు, చివరికి ఆయన ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధంగా అనిపించకుండా ఉండలేకపోతున్నాయి. ఒక పార్టీకి భజన చేస్తూ పాత్రికేయతను మరిచి వేసినట్టు కనిపించడమంటే ఇదే కావచ్చు.