ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్య వైరం చాలా కాలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాధాకృష్ణ తన పత్రికలో కవితపై నిరంతరం కథనాలను ప్రచురిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో దేశంలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ, ఆయన వార్తలకు ప్రాధాన్యత తగ్గించి, కవిత అంశంపైనే రాధాకృష్ణ ప్రధానంగా దృష్టి సారించారు.
కవితను కేంద్రంగా చేసుకుని ఆయన పత్రికలో బ్యానర్ స్టోరీస్ ప్రచురించారు. ఇతర పోటీ పత్రికలతో పోలిస్తే, సంచలనాత్మక కథనాలను ప్రచురించి కాంగ్రెస్ పార్టీకి అనుకోని బూస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేయలేనిది, రాధాకృష్ణ చేసి చూపించారు. ఒక రకంగా కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణకు రుణపడి ఉండాలి. కవిత ఎపిసోడ్లో ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.
రాధాకృష్ణ కథనాలపై కవిత స్పందన
ఇటీవల తన పత్రికలో కథనాలు ప్రచురించినప్పుడు కవిత నేరుగానే స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని “ఫేక్ న్యూస్” అంటూ ఖండించారు. ఇటీవలి మీడియా చిట్ చాట్లో కూడా “చిల్లర వ్యక్తులతో.. కిరాయి ప్రచారాలు” అంటూ కవిత మండిపడ్డారు. అయితే, ఆమె ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఈ విమర్శలు చేయడం గమనార్హం.
కవిత స్టాండ్ మార్పు, పార్టీతో విభేదాలు?
కవిత ఎపిసోడ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆమెకు, ఆమె తండ్రికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్న క్రమంలో, కవిత ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకున్నారు. తన తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ, తమ ప్రభుత్వంలో ఎత్తివేసిన ధర్నా చౌక్లోనే బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో కేవలం జాగృతి నాయకులు, కవిత అనుచరులు మాత్రమే పాల్గొన్నారు. గులాబీ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నుంచి ఇందులో పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతి కథనంలో కొత్త ఆరోపణలు
ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి కవితపై మరో ప్రతికూల కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈసారి బ్యానర్ స్టోరీ కాకుండా, లోపలి పేజీలకు పరిమితం చేసింది. కవితపై గులాబీ సుప్రీం (కేసీఆర్) కోపంగా ఉన్నారని, ఇంతవరకు ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, గతంలో ఆమె వద్దకు దామోదర్ రావు, గండ్ర రామ్మోహన్ రావు తమంతట తామే వెళ్లారని, వారు కేసీఆర్ పంపితే వెళ్లలేదని రాధాకృష్ణ బాంబు పేల్చారు. అంటే, ఈ లెక్కన కవితను గులాబీ సుప్రీం క్షమించలేదని, ఆమెతో మాట్లాడటం లేదని, దూరం పెట్టారని రాధాకృష్ణ రాసుకొచ్చారు.
మరి ఇంతటి సమాచారం ఇతర పత్రికలకు ఎందుకు తెలియడం లేదు? ఆ పత్రికలలో ఎందుకు రావడం లేదు? కవిత ఆరోపించినట్టు ఇవన్నీ “కిరాయి రాతలేనా? ఫేక్ ప్రచారాలేనా?” గతంలో షర్మిలపై రాధాకృష్ణ ఇలానే రాసినప్పుడు చాలామంది విమర్శించారు. ఆ తర్వాత షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా కవిత షర్మిల పాత్ర పోషిస్తుందా? మరో షర్మిల అవుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.