ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల ఎంట్రీ ఒకప్పుడు సంచలనం. వైఎస్సార్ తనయగా, జగన్ సోదరిగా ఆమెపై అంచనాలు భారీగా ఉన్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ గూటికి చేరిన తర్వాత, ఆ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. అయితే, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పుంజుకోవడం కంటే, ఆమె మాటల్లో “అన్నయ్య జగన్” ప్రస్తావన ఆయన మీద పడి ఏడుపు దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో షర్మిలపై వస్తున్న వ్యంగ్యాస్త్రాలు ఈ ధోరణికి అద్దం పడుతున్నాయి. “ఏడుపు మానవా? అన్నపైనే ఏడవకండా…” అంటూ మొదలయ్యే సెటైర్లు, ఆమె రాజకీయ శైలిపై సూటి ప్రశ్నలు సంధిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు, ఆమె పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి గానీ, ఇంకా కుటుంబ వ్యవహారాలను, అన్నయ్య ప్రతిపక్ష నేతగా చేస్తున్న పనులను తప్పుపట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక రాజకీయనాయకురాలిగా షర్మిల ప్రజల సమస్యల పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేయాలని, కేవలం జగన్ జనంలోకి వెళ్లి ప్రతిపక్ష నేతగా చేస్తున్న పనులపై పడి విమర్శిస్తే వర్కవుట్ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది హాస్యాస్పదంగా మారుతుందనేది ఈ సెటైర్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ” నీ పార్టీ కోసం.. ప్రజల సమస్యల కోసం పాటుపడకుండా ఆ పనిచేస్తున్న మీ అన్నయ్య జగన్ పై ఇలా ఏడవడం ఏంటి తల్లి?” అంటూ నెటిజన్లు ఆమెకు పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు.
నిజమే, ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయి దశాబ్దం దాటింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్, రాష్ట్ర విభజన తర్వాత అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ తరుణంలో, ఒక నాయకురాలిగా షర్మిల తన శక్తియుక్తులను పార్టీ పునర్నిర్మాణం, ప్రజల విశ్వాసం తిరిగి పొందడంపై కేంద్రీకరించాలి. కేవలం భావోద్వేగ ప్రసంగాలు, ఆరోపణలతో రాజకీయాల్లో దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వవు. అది ఆమెకే కాకుండా, ఆమె సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా, షర్మిలమ్మ తన ఆరోపణలను పక్కనపెట్టి, కట్టెదుట ఉన్న రాజకీయ పనులపై దృష్టి సారిస్తేనే, ఆమె రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమె నుంచి పని కోరుకుంటున్నారు, ఈ ఏడుపు కాదు.