గుజరాత్లోని చంద్ఖేడలో లూలూ గ్రూప్ రూ. 519.41 కోట్లు వెచ్చించి 66,168 చదరపు మీటర్ల భూమిని సొంతం చేసుకుంది. దీని అర్థం ఏంటంటే వారు మార్కెట్ ధరకు భూమి కొనుగోలు చేస్తున్నారు, వ్యాపార నిబద్ధతతో ముందుకు వెళ్తున్నారు.
కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. విశాఖపట్నంలో రూ. 2,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా లూలూకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదీ కాకుండా, విజయవాడ పాత బస్టాండ్, నగర హృదయంలో ఉన్న అత్యంత విలువైన స్థలం కూడా లూలూ ప్రాజెక్ట్ పేరిట అప్పగించబడిందని సమాచారం.
ఇలా చూస్తే లూలూ కంపెనీ ఇతర రాష్ట్రాల్లో భూములు సొంతంగా కొనుగోలు చేస్తుండగా, మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వాలు వారికి వందల కోట్లు విలువైన స్థలాలను ఉచితంగా లేదా తక్కువ ధరకే అప్పగిస్తున్నాయి.
ప్రశ్న ఏమిటంటే.. ఒకే కంపెనీకి రెండు రాష్ట్రాలు ఇంత భిన్నంగా వ్యవహరించడానికి కారణం ఏమిటి? వ్యాపార ప్రాజెక్టులు పేరుతో ప్రభుత్వ ఆస్తులు కొందరికి ఉచితంగా ఇస్తే, ప్రజల హక్కులు ఎక్కడ నిలుస్తాయి? వాణిజ్యాభివృద్ధి పేరుతో రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడం అవసరం. కానీ, ప్రజల ఆస్తులను ఉచితంగా బహూకరించడం పెట్టుబడి కాదు.. నష్టం. ప్రభుత్వాలు వ్యాపారసౌహార్దతతో పాటు ప్రజల ప్రయోజనాలనూ కాపాడాలి.
లూలూ డీల్స్ లాంటి ఉదాహరణలు మనకు ఒక స్పష్టమైన ప్రశ్నను ఎదిరిస్తాయి.. “మన భూమి ఎవరి కోసం?”
వ్యాపారం పేరు చెప్పి వేల కోట్ల విలువైన భూములు కొంతమందికి అప్పగించడం కంటే, పారదర్శక విధానాలతో రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ప్రజా ఆస్తి అంటే అది ఎవరి సొత్తు కాదు.. ప్రజలందరిదే.