కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. వేమూరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతుండగా, కొంతమంది మీడియా వ్యక్తుల వ్యాఖ్యలు మాత్రం ప్రజల కోపానికి గురవుతున్నాయి.
అందులో ముఖ్యంగా మహా టీవీ యాంకర్ మహా వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతున్నాయి. ప్రమాదానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం లేదా రోడ్ల దారుణ స్థితి కాదని, “రాత్రి ప్రయాణమే కారణం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు “ఇదీ కొత్త డైవర్షన్!” అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
“వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి మహా వంశీ కొత్త నిర్వచనం!”… “ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఇది!”… “మహా టీవీని కాపాడడానికి అతి తెలివి చూపిస్తున్నాడు!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సుల రాత్రి ప్రయాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, రోడ్ల దారుణ స్థితి, వాహనాల కండిషన్ వంటి విషయాలపై చర్చ జరగాల్సిన వేళ “నైట్ ట్రావెల్ చేయకూడదట” అంటూ వ్యాఖ్యానించడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
మహా వంశీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు, రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. “ప్రమాదం రాత్రి జరిగిందని, దానిని రాత్రి ప్రయాణం కారణంగా చెప్పడం అంటే అసలు సమస్య నుండి ప్రజల దృష్టి మళ్లించడమే” అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రజల ప్రాణాలు పోయిన విషాద ఘటనను కూడా రాజకీయ కోణంలో చూపించడానికి ప్రయత్నిస్తోన్న మీడియా వైఖరిపై విస్తృత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “అతి తెలివి కొన్నిసార్లు ప్రజల కోపానికి దారితీస్తుంది” అనే మాటను మహా వంశీ మరోసారి రుజువు చేశాడన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
