వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు ముందుగా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఎదురైన భారీ పరాజయం తర్వాత జగన్ తన రాజకీయ దారిలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావడమే ఆయన కొత్త లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇప్పటికే జగన్ విద్యార్థి, యువజన విభాగాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై “ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయండి, భవిష్యత్తు మీదే” అని సందేశమిచ్చారు. పార్టీ అంతర్గత సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో సుమారు 50 శాతం నియోజకవర్గాలను యువతకు కేటాయించే ఆలోచనలో జగన్ ఉన్నారని సమాచారం.
అయితే గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వంటి ప్రయోగాలు ఫలించలేదు. ఈసారి మాత్రం జగన్ సర్వే ఆధారంగా యువ అభ్యర్థులను ఎంపిక చేసి, 2027లో జరగనున్న తన పాదయాత్రలో వారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాదయాత్ర విజయవంతమైతే అప్పటికప్పుడు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీ లోపల సీనియర్ల అసంతృప్తి తథ్యం అయినప్పటికీ, జగన్ “యువతే భవిష్యత్తు” అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. కానీ ఈ వ్యూహం వాస్తవంగా ప్రజలకు నచ్చుతుందా? లేక మరోసారి ‘వికటించిన ప్రయోగం’గా మారుతుందా? అనేది 2029 ఎన్నికలతో తేలనుంది.

