ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఓ కేసులో భాగంగా సిబిఐ కోర్టుకు హాజరైన జగన్, ఆ తర్వాత లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు. అయితే, ఈ పర్యటనలో కనిపించిన భారీ జనసమీకరణ, నాయకుల తాకిడి చూస్తుంటే.. ఇది కేవలం వ్యక్తిగత పర్యటనలా కాకుండా, ఒక రాజకీయ “బలప్రదర్శన”లా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ను స్వాగతించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లోటస్ పాండ్ వరకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి సైతం జగన్ను రహస్యంగా కలిశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఏపీలో అధికారం కోల్పోయాక, తెలంగాణలో పార్టీని మళ్లీ యాక్టివ్ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
గతంలో 2014 తర్వాత చంద్రబాబును ఉమ్మడి శత్రువుగా భావించి కేసీఆర్, జగన్ పరస్పరం సహకరించుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీఆర్ఎస్కు జగన్ పరోక్ష మద్దతు తెలిపారు. ఇప్పుడు ఇద్దరు నేతలు అధికారానికి దూరంగా ఉండటంతో, మరోసారి పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారింది. తెలంగాణలో అత్యంత బలమైన రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అండగా నిలిచింది. ఈ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేయనిదే బీఆర్ఎస్ పుంజుకోవడం కష్టం.
జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీని విస్తరిస్తే, వైఎస్ అభిమానులు మరియు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ చీలిక రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టి, పరోక్షంగా కేసీఆర్కు లాభం చేకూర్చే వ్యూహంగా కనిపిస్తోంది.
ఏపీలో ఓటమి, తెలంగాణలో కేసీఆర్ ఇబ్బందుల నేపథ్యంలో.. వైయస్సార్సీపీని తెలంగాణలో యాక్టివ్ చేయడం అనేది ఇద్దరికీ అవసరమైన రాజకీయ ఎత్తుగడగా మారే అవకాశం ఉంది. జగన్ ఎంట్రీ కేవలం ఊహాగానమా లేక పక్కా రాజకీయ స్కెచ్చా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.


