ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి విడదల రజిని తీసుకునే తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె రాజకీయాలకు గుడ్బై చెబుతారా? లేదా పార్టీ మారుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
విడదల రజిని 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఈ మార్పు కారణంగా ఆమె అక్కడ ఘోర పరాజయాన్ని చవిచూశారు.
ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమెను రేపల్లె నియోజకవర్గానికి వెళ్లమని ఆదేశించినట్లు సమాచారం. ఇది బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం. అయితే, పార్టీ అధినేత ఇచ్చిన ఈ ఆదేశాన్ని రజిని ససేమిరా అనడం వల్లే ఆమె పార్టీ మారుతారనే ఊహాగానాలు, టాక్ ఒక్కసారిగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. రజిని నిర్ణయంపై ఈ చర్చ మరింత బలం చేకూర్చింది. గతంలో కూడా ఆమె పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, రేపల్లె ఇన్ఛార్జి బాధ్యతలపై ఆమె మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై మాజీ మంత్రి విడదల రజిని ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఆమె మౌనం వెనుక పార్టీ మారుతున్నారా? లేక జగన్తో ఏర్పడిన అంతరాయం తాత్కాలికమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా లేకపోవడం, సోషల్ మీడియాలో కూడా కనిపించకపోవడంతో విడదల రజిని తదుపరి నిర్ణయం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.


