కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల ‘దిష్టి’ తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే, ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు.
ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోయినా, పార్టీ అధికార ప్రతినిధి జనసేన అరుణ మాత్రం తెలంగాణ నేతలపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన అరుణ, దిష్టి వ్యాఖ్యల వివాదంపై తెలంగాణ నేతల తీరును తప్పుబట్టారు. “దిష్టి” అనే పదం అంత పెద్ద వివాదాస్పదమైన పదమని తమకు తెలియదని ఆమె అన్నారు.
“దిష్టి అంటే మామూలుగా అంత పెద్ద వర్డ్ అని తెలియదు. చిన్న పిల్లలకు, పెళ్లి కూతురు, పెండ్లికొడుకులకు దిష్టి తీయడం కామన్. దీన్ని కూడా వివాదం చేసి, మీడియా ముందు సవాళ్లు చేసి, బెదిరిస్తారని తెలియక ఇన్నాళ్లు వాడామా?” అని ఆమె మండిపడ్డారు.
ఈ సందర్భంగానే ఆమె తెలంగాణ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. “పనికి మాలిన వాళ్లంతా మోపయ్యారు తెలుగు రాష్ట్రాల్లో…” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ నేతలు, మంత్రులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఘర్షణ వాతావరణాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధంతో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో, జనసేన అరుణ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
https://x.com/greatandhranews/status/1995867347056558267?s=20


