“నిన్న రాత్రి వరకు అది మా ఇల్లు.. మా పిల్లలతో కలిసి నిదురించిన గూడు.. కానీ తెల్లారేసరికి అది మట్టి దిబ్బ.” ఇది విజయవాడ జోజినగర్ బాధితుల గుండె లోతుల్లోంచి వస్తున్న ఆర్తనాదం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి, వారి ఇళ్లే కూలిపోతుంటే కలిగే ఆవేదన వర్ణనాతీతం. విజయవాడ నడిబొడ్డున ఉన్న జోజినగర్లో బుధవారం జరిగిన విధ్వంసం, పేదవాడి సొంతింటి కలని చిదిమేయడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను, నాయకుల ద్వంద్వ వైఖరిని మరోసారి ఎండగట్టింది.
విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న 2.17 ఎకరాల స్థలం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు. అక్కడ నివాసం ఉంటున్న పేదలు రూపాయి రూపాయి కూడబెట్టుకుని, కష్టపడి ఇళ్లు కట్టుకున్నారు. కానీ, ఆ స్థలంపై కన్నేసిన కొందరు ‘పచ్చ’ నేతలు పక్కా ప్రణాళికతో చక్రం తిప్పారన్నది బాధితుల ప్రధాన ఆరోపణ.
కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి, సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ, ఆగమేఘాల మీద 42 ఇళ్లను నేలమట్టం చేయడం వెనుక పెద్దల హస్తం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. “చినబాబు” మరియు స్థానిక పార్లమెంటు సభ్యుడి కనుసన్నల్లోనే ఈ తతంగం నడిచిందని, దీని వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నది ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరినే. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రహరీ గోడలు కూల్చితేనే పవన్ కళ్యాణ్ కారు పైకెక్కి, ఉగ్రరూపం దాల్చి, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “నేనున్నాను” అంటూ బాధితులకు భరోసా ఇచ్చారు.
మరి నేడు, విజయవాడలో ఏకంగా 42 ఇళ్లు నేలమట్టమై, పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడితే ఆ స్పందన ఏది? ఆ ఆవేశం ఏమైంది? కేవలం ప్రహరీ గోడలు కూలితేనే అంతలా స్పందించిన జనసేనాని, నేడు పేదల బతుకులు కూలిపోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకే ఈ మౌనమా? లేక పేదల కష్టాలు ఆయన దాకా చేరడం లేదా?
“రాత్రి ఇదే మట్టిలో పడుకున్నాం.. మాకు న్యాయం చేసే నాథుడే లేడా?” అని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రజా నాయకులు అని చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పేదల పక్షాన నిలబడతారా లేక భూములు ఆక్రమించే బడా బాబులకు కొమ్ము కాస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అధికారం శాశ్వతం కాదు, కానీ పేదవాడి ఉసురు మాత్రం కచ్చితంగా తగులుతుంది. జోజినగర్ మట్టి దిబ్బల సాక్షిగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.


