కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. అంతలా సుపరిచితులు అయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది. ప్రజలను మరింత దగ్గర చేసింది. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన ఓటమి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు తెలంగాణ లోని కేటీఆర్ కు సైతం. అయితే అంతలా గుర్తింపు తెచ్చి పెట్టింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంతో క్రేజ్ అయితే వచ్చింది కానీ.. 2024 ఎన్నికల్లో గెలుపు మాత్రం దక్కలేదు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశానని.. అటువంటి తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేతిరెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మళ్లీ క్షేత్రస్థాయిలోకి దిగారు. గతంలో విపరీతమైన క్రేజ్ తెచ్చిన ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమాన్ని ప్రతిపక్షంలో ఉండగానే తిరిగి ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న కేతిరెడ్డి, ఇప్పుడు వరుస పర్యటనలు, ఇంటర్వ్యూలతో చర్చల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమం ప్రచార స్టంట్ అన్న విమర్శలు ఉన్నా, ప్రజాదరణ మాత్రం దక్కింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో, కేతిరెడ్డి పునరాగమనం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయత్నం 2029 ఎన్నికల్లో ఫలితం ఇస్తుందా? అన్నది వేచి చూడాలి.


