రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి కాలంలో కూటమి నేతల మాటల స్థాయి మాత్రం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వీరి మాటలు బూతులా? లేక సూక్తులా? అన్న ప్రశ్న ప్రజల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
అంబటి రాంబాబు ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్లు మాట్లాడేది బూతులు కాదు… సూక్తులే అన్నట్టుగా వీరి అనుచరులు సమర్థించుకుంటున్నారు. కానీ అదే నేతలు గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలపై తీవ్రంగా విరుచుకుపడ్డ సందర్భాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు ‘రాజకీయాల్లో హద్దులు ఉండాలి’, ‘సభ్యత పాటించాలి’ అంటూ పెద్ద పెద్ద నీతులు చెప్పిన వారే… ఇప్పుడు అదే బాటలో నడుస్తుండటం విరోధాభాసంగా మారింది.
సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, అనిత, అయ్యన్న పాత్రుడు, బాలకృష్ణ సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, పట్టాభిరాం, చింతా ప్రభాకర్ వంటి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీపై, జగన్పై చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ బయటకు తీస్తూ నిలదీస్తున్నారు. “అప్పుడు ఇవి బూతులే… ఇప్పుడు సూక్తులా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ అసలు సమస్య ఎవరు ఏ పార్టీకి చెందినవారు అన్నది కాదు. మాటల స్థాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయి. బూతులతో నోర్లు పారేసుకుని, అదే సమయంలో ఇతరులకు నీతులు చెప్పడం ప్రజలను మరింత దూరం చేస్తుంది. రాజకీయాల పట్ల అసహ్యం పెంచుతుంది.
బూతులతో రెచ్చిపోవడం రాజకీయ ధైర్యం కాదు. అది మాటల పేదరికం మాత్రమే. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన నేతలు, వ్యక్తిగత దూషణలకే పరిమితమైతే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. అలాంటి మాటలకు శిక్ష ఏంటన్నది చట్టం చూసుకోవాలి. కానీ అంతకంటే ముందు రాజకీయ పార్టీలే తమ నేతలపై నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజలు ఇప్పుడు మౌనంగా లేరు. సోషల్ మీడియా ప్రతి మాటను రికార్డు చేస్తోంది. నిన్న చెప్పిన మాటలే నేడు ప్రశ్నలుగా మారుతున్నాయి. కాబట్టి బూతులు మాట్లాడి, సూక్తుల ముసుగులో తప్పించుకునే రోజులు పోయాయి. రాజకీయాల్లో నిజమైన మార్పు కావాలంటే… మాటల్లో కూడా మార్పు రావాల్సిందే.
https://x.com/JaganannaCNCTS/status/2017913803795841476?s=20


