తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం చివరకు నిజాల కాంతిలో కరిగిపోయింది. లడ్డూలో జంతు కొవ్వు యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని సీబీఐ ఎంక్వయిరీ స్పష్టంగా తేల్చడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది.
ఈ వివాదంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. తిరుమల లడ్డూ పవిత్రతను ప్రశ్నార్థకం చేసేలా చేసిన వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని సీబీఐ విచారణలో స్పష్టంగా తేలింది. ఈ నివేదికతో ఇప్పటివరకు సాగిన ప్రచారం అంతా అసత్యమని రుజువైంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల ప్రసాదాన్ని వివాదంలోకి లాగారని విమర్శకులు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందిస్తూ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న రిపోర్టు వచ్చిన తర్వాతే తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం జరిగిందని, ఈ అంశం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని పేర్కొన్నారు.
అయితే, ఆయన వివరణలు భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోతున్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డూపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం రాజకీయ తప్పిదం కాదని, ఆధ్యాత్మిక విశ్వాసాలపై దాడిగా భావిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల కోసం దేవాలయాలను, ప్రసాదాలను వివాదాల్లోకి లాగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడినట్లే, అసత్య ప్రచారాన్ని కూడా బయటపెట్టిందని భక్తులు భావిస్తున్నారు.
ఇది కేవలం ఒక రాజకీయ వివాదం కాదు… కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా చరిత్రలో మిగిలిపోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

