తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు బయల్దేరిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించారు. గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకున్న జగన్, దాడి కారణంగా జరిగిన నష్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, వారి ధైర్యాన్ని నిలబెట్టేలా మాటలతో అండగా నిలిచారు. ఇలాంటి దాడులతో ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరని స్పష్టం చేస్తూ, పార్టీ శ్రేణులు, నాయకులు మనోధైర్యం కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు.
తదనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, రాష్ట్రంలో కూటమి పాలనలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి దాడులు, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అన్యాయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం ఇస్తారని అన్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పాలకులు, చట్టవ్యవస్థను నిర్వీర్యం చేస్తూ హింసకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. అంబటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.ఇక జగన్ రాకతో అంబటి రాంబాబు నివాసం కార్యకర్తలు ప్రజలతో కిక్కిరిసి జగన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది.


