తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ అంశంపై అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి.
వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థ పేరును ప్రస్తావిస్తూ, ఈ కంపెనీ ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తూ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లో “బోలే బాబా”, మహారాష్ట్రలో “ఇందాపూర్”, హర్యానాలో “జై అంబే మాగ్రో”, ఆంధ్రప్రదేశ్లో “హెరిటేజ్” పేర్లతో ఈ నెట్వర్క్ పనిచేస్తోందని ఆరోపించారు. సూది కోసం సోదికి వెళితే పాత వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అలాగే ధరల విషయంలో కూడా వెంకట్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. “మేము రూ.370కి నెయ్యి కొనుగోలు చేస్తే కల్తీ అని అంటున్నారు. మరి మీరు రూ.279కి కొనుగోలు చేసిన నెయ్యి మాత్రం కల్తీ కాదా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థల నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదానికి సంబంధించిన విషయం కావడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో నిజానిజాలు వెలికితీయడానికి సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి, భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా పారదర్శక చర్యలు తీసుకోవడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
https://x.com/YSJ2024/status/2021971229843104113?s=20


