ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాటల్లోనే మార్పు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అప్పుల విషయంలో చేసిన ఆరోపణలు, అసెంబ్లీలో చెప్పిన గణాంకాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన హోంమంత్రి అనిత, జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల వరకు అప్పులు చేసింది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి.
అయితే, నేడు అసెంబ్లీలో అదే విషయంపై మాట్లాడిన హోంమంత్రి అనిత్, జగన్ చేసిన మొత్తం అప్పు రూ.9 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పడం గమనార్హం. ఎన్నికల సమయంలో చెప్పిన గణాంకాలు, ఇప్పుడు అధికారికంగా చెప్పిన సంఖ్యల మధ్య పెద్ద తేడా ఉండటం పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇక గణాంకాల పరంగా చూస్తే 2014 నుండి 2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం సుమారు రూ.4 లక్షల కోట్లు అప్పు చేయగా, 2019 నుండి 2024 మధ్య జగన్ ప్రభుత్వం సుమారు రూ.3 లక్షల 50 వేల కోట్లు అప్పు చేసినట్లు వివరాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేయడానికి చెప్పిన సంఖ్యలు ఎంతవరకు నిజం? అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడుతున్న వాస్తవాలు ఏంటి? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మొత్తానికి, అప్పుల విషయంలో కూటమి నేతల వ్యాఖ్యలు మారడం రాజకీయంగా కొత్త వివాదానికి దారి తీస్తోంది.


