ఈ రాజీనామా సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విదేశాలలో ఉన్నారు. నిన్న ఆయన బెంగళూరుకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంలోనే విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను జగన్కు పంపించారు. 2029లో జగన్ భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ, తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి వ్యవసాయ రంగంలో కొనసాగుతానని వెల్లడించారు.
అంతేకాకుండా, విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి కోరారు. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నార్వే వంటి దేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా, సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, కోర్టు 15 రోజుల విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుండి మార్చి 10 మధ్య 15 రోజులు విదేశాల్లో పర్యటించేందుకు వీలు కల్పించింది. అయితే, కోర్టు ఐదు లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.
ఇక వైసీపీ అధినేత జగన్ ఫిబ్రవరి 3న తాడేపల్లికి రానున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో, జగన్ ఎలా స్పందిస్తారు అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఆయన బెంగళూరులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని, ఈ రాజీనామాకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమేనని, ఇతర పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగిందని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది.