త్వరలో ఆ నలుగురు.. షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ పరాజయం ఎదుర్కొన్న తర్వాత, పార్టీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక మంది నేతలు వైసీపీకి గుడ్‌బై చెబుతుండగా, మరోవైపు వైయస్ షర్మిల పార్టీపై తన పట్టును బలపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైయస్ జగన్ కూడా తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు.

గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాలని ఉవ్విళ్లూరిన నేతలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారడంతో కాంగ్రెస్ నేతలనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరగా, మరో నలుగురు లేదా ఐదుగురు కీలక నేతలు త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, రాజకీయంగా పెద్దగా యాక్టివ్ కాదు. గోదావరి జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం పల్లంరాజును వైసీపీలోకి ఆహ్వానించేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారికంగా వైసీపీలో చేరతారని అంటున్నారు.

అంతేగాక, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ఆయన, రోశయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో కొనసాగినప్పటికీ, ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించాలని భావిస్తున్నారని సమాచారం.

అదే విధంగా, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా జగన్ పక్షాన మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీ విధానాలను సమర్థిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న హర్షకుమార్ త్వరలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని చెబుతున్నారు.

ఇవే కాకుండా, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ నేతలంతా పార్టీ మారే దశలో ఉన్నారని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త మలుపు తిరుగుతుందా? షర్మిలకు ఇదొక పెద్ద షాక్ అవుతుందా? అనేది వేచి చూడాలి.