వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను తీవ్రంగా విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ పొందినప్పటికీ, తాజాగా ఫోటోల మార్ఫింగ్ కేసులో మాత్రం ఆయనకు ఊరట లభించడం లేదు.
గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు పోసానిని కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మార్ఫింగ్ ఫోటోలను సృష్టించి, వాటిని ప్రెస్ మీట్లలో ప్రదర్శించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై సీఐడీ దృష్టి సారించింది.
ఇంతకుముందు అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ మంజూరై, కర్నూలు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, సీఐడీ పీటీ వారెంట్ జారీ చేయడంతో ఆయనను తిరిగి కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న పోసానిని సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా, ఫోటోలను మార్ఫింగ్ చేయమని ఎవరు చెప్పారో, ఎవరైనా ప్రోత్సహించారో అనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేయనుంది.
పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగి దాదాపు 20 రోజులు కావస్తోంది. ఆయన రిమాండ్ ఈనెల 26 వరకు ఉంది. గత విచారణలో పోసాని సజ్జల పేరును బయటపెట్టారని వార్తలు వచ్చాయి. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే తాను చదివానని పోసాని విచారణలో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, ఈరోజు సీఐడీ జరుపుతున్న విచారణ కీలకంగా మారనుంది. పోసాని ఈసారి ఎవరి పేరును వెల్లడిస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు, సినీ పరిశ్రమ నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు అందుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమికి మద్దతుదారుగా ఉన్న నటుడు శివాజీ తాజాగా స్పందించారు. పోసాని తన తప్పును తెలుసుకున్నారని, ఆయన విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మంచిదని శివాజీ సూచించారు. రాజకీయ నాయకులు కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడినా పెద్దగా పట్టించుకోరని, కానీ రాజకీయాలతో అంతగా సంబంధం లేని సినీ నటులు మాత్రం స్థాయికి మించి విమర్శలు చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి, పోసాని కృష్ణ మురళి విషయంలో రాజీ కుదిర్చేందుకు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.