ఖరీదైన వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి. దాదాపు రూ.3500 కోట్ల మేర పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఏప్రిల్ 7వ తేదీలోగా ఈ బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. ఈ పరిణామం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీనిని కొనసాగించాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ద్వారా అందించే వైద్య సేవల పరిధిని మరింత విస్తరించారు. అయితే, ఆ సమయంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో నిధుల కొరత ఏర్పడి ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. దీని ఫలితంగానే భారీగా బకాయిలు పేరుకుపోయాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి సుమారు రూ.2000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని దశలవారీగా చెల్లిస్తూ వస్తోంది. కానీ, గత మూడు నెలలుగా మళ్లీ బిల్లులు పేరుకుపోయి రూ.3500 కోట్లకు చేరాయి. నిధులు లేకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందుకే పెండింగ్ బిల్లులు చెల్లించాలని గట్టిగా కోరుతున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు తుది గడువు విధించాయి. ఆ లోపు చెల్లింపులు జరగకపోతే అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని భావిస్తోంది. దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కొంత మొత్తంలో బకాయిలను చెల్లించడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు.