ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఆయన వారంలో రెండు రోజులు సిఐడి కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంటుంది. విచారణకు సహకరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం తనపై ఉన్న కేసుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రిమాండ్ నుండి విడుదలైన తర్వాత ఆయన చాలా నీరసంగా కనిపించడమే కాకుండా, తనను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పోసాని కృష్ణ మురళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రస్తుతం రాజకీయ మద్దతు లేకుండా తన కేసుల విషయంలో కష్టాలు తప్పవని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని కృష్ణ మురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఒకానొక సమయంలో ఆయన సాక్షి ఛానెల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమానికి హోస్ట్గా కూడా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రమోషన్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన హఠాత్తుగా ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని ప్రకటించారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని కూడా స్పష్టం చేశారు. అయితే అప్పట్లో కూటమి ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి కారణంగానే పోసాని అలా వెనక్కి తగ్గారని వార్తలు వినిపించాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనపై కేసులను కొనసాగించింది.
పోసాని కృష్ణ మురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉండేవారు. 2014లో పార్టీ ఆవిర్భావం నుండి జగన్ నాయకత్వాన్ని ఆయన సమర్థించారు. అంతకుముందు ఆయన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ గొంతును బలంగా వినిపించారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్ ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవినిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది సినీ నటులు మద్దతు తెలిపినప్పటికీ, పోసాని స్థాయిలో ఎవరికీ కీలక పదవులు దక్కలేదు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే గట్టిగా బదులిచ్చేవారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోసానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చుట్టూ కేసులు నమోదయ్యాయి. దాదాపు 26 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. తాను దేనికి భయపడ్డారో అది నిజమైంది. కేసులు ఆయనను వెంటాడాయి. ఇప్పుడు కనీసం ఆ కేసుల నుండి బయటపడటానికైనా రాజకీయ మద్దతు అవసరం కాబట్టి, ఆయన మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారతారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో వేచి చూడాలి.