వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు.
నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు గుండెలోని మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు శస్త్రచికిత్స (సర్జరీ) అవసరమని వైద్యులు తేల్చారు. దీనికి తోడు ఆయన మూత్రపిండాల సమస్యతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే అత్యవసరంగా ఆయనను ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొడాలి నాని అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కొడాలి నాని అస్వస్థతతో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి మాత్రం గుండె సంబంధిత సమస్య తీవ్రం కావడంతో ఆందోళన నెలకొంది. కొద్ది రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండెపోటు అని తేలడంతో ఏఐజి ఆసుపత్రిలో చేరారు. స్టంట్స్ వేసే అవకాశం ఉంటే అక్కడే చికిత్స అందించేవారు. కానీ సర్జరీ తప్పనిసరి కావడంతో వెంటనే ముంబైకి తరలించారు. మూత్రపిండాల సమస్య కూడా బయటపడటంతో వైద్యులు మరింత అప్రమత్తమయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ముంబైలోని వైద్యులతో మాట్లాడి, నానికి వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు. తొలుత హైదరాబాద్లోనే సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయాలని నిర్ణయించారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్కు కూడా ఇదే తరహా సమస్య రాగా, ముంబై ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.
కుటుంబ సభ్యులు కొడాలి నానిని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. బుధవారం ఆయనకు సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పాండా ఆయనకు బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో డాక్టర్ పాండా ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ళ నారాయణ, రఘురామ కృష్ణంరాజు వంటి ప్రముఖులకు కూడా బైపాస్ సర్జరీ చేశారు.
కొడాలి నాని ఆరోగ్యం విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సర్జరీ తర్వాత కొడాలి నాని రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే, కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులకు సూచించారు.