ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరాల నియంత్రణకు సాంకేతికతను ముమ్మరంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పట్టుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల వెనుక వైపు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించారు.
డ్రోన్ ద్వారా తమను గుర్తించిన విషయం చూసిన విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “సారీ గాయ్స్.. ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. కెనాట్ హెల్ప్” అంటూ సరదాగా కామెంట్ చేశారు. పోలీసులు డ్రోన్ల ద్వారా తమ డ్యూటీని సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.
కాగా ఏపీలో డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలను గుర్తించడం ఇది మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం మంత్రి అనిత కూడా ఇలాంటి వీడియోనే పోస్ట్ చేశారు. ఓ లారీలో కూర్చుని పేకాట ఆడుతున్న జూదగాళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవిస్తూ పట్టుబడటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
డ్రోన్ల రాకతో నేరస్తులు భయాందోళన చెందుతున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో మద్యం తాగాలన్నా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలన్నా వెనకడుగు వేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు సైతం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు జంకుతున్నారు. పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా నేరాలను నియంత్రించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులోనూ డ్రోన్ టెక్నాలజీని మరింత విస్తృతంగా ఉపయోగించి నేరాలను అదుపు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.