నందమూరి అభిమానులకు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. సినీ నటుడు మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు ఢిల్లీలో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో విశేష సేవలందించడంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో 1960లో నందమూరి తారక రామారావు పద్మ అవార్డు అందుకున్నారు. ఇన్నాళ్లకు నందమూరి వంశంలో బాలకృష్ణకు ఈ గౌరవం దక్కడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు పురస్కార ప్రదానం
పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ పద్మ భూషణ్ అందుకోనున్న నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం అవార్డుల ప్రదానం జరగనుంది.
జూనియర్ ఎన్టీఆర్ హాజరుపై ఆసక్తికర ఊహాగానాలు
ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా హాజరవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇది నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త అవుతుంది. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలోని కొంతమంది హీరోల మధ్య దూరం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను కుటుంబ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదనే కామెంట్స్ వినిపించాయి.
అయితే, ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో మార్పు కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు వంటి సమయాల్లో జూనియర్ ఎన్టీఆర్ స్పందన కొందరికి రుచించలేదు. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన క్రమంలో, చంద్రబాబు, లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించినప్పుడు కూడా “బాల బాబాయ్” అంటూ ఆయన శుభాకాంక్షలు తెలపడం కుటుంబంలో సఖ్యత పెరుగుతోందనడానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం?
బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా కుటుంబంలో విభేదాలు లేవని సందేశం పంపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, తనపై ఎటువంటి రాజకీయ ముద్ర పడకుండా జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నందున, ఆయన హాజరు కాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి, బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కడం నందమూరి కుటుంబానికి, అభిమానులకు గర్వకారణం. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకే వేదికపై కనిపిస్తే, అది ఒక చారిత్రక చిత్రంగా నిలిచిపోవడం తో పాటు కుటుంబ ఐక్యతకు ప్రబల నిదర్శనంగా భావిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ హాజరు ఈరోజు సాయంత్రం తేలనుంది.