ఇప్పుడు ఇది సూరవరం ప్రతాపరెడ్డి రోజులు కాదు. రామ్ నాథ్ గోయెంకా రోజులు అయితే అసలే కాదు. పత్రికా రంగం ఇక ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం అనే భావనకీ దూరమవుతోంది. ప్రజల సమస్యలు మాత్రమే వెలికి తీసే పత్రికలు గోల్కొండ గారిది లాంటి నిజాయితీతో పనిచేసే రోజులూ కావు.
ఈ రోజుల్లో పత్రిక యజమానులకు రాజకీయ రంగులు ఉంటాయి. రాజకీయ సంబంధాలు, వాసనలు ఉంటాయి. రాజకీయ నాయకులతో మమేకం అవ్వడం సహజం. రాజకీయ పార్టీకి డప్పు కొట్టే అవసరం కూడా ఉంటుంది. పత్రికలు నడుపడమంటే ఒక వ్యాపారం. ఆ వ్యాపారంలో పనిచేసే వారు ఉద్యోగులు, వారికి జీతాలు, భవిష్యనిధులు, జీత పెంపులు ఇవ్వాలి. ఇవన్నీ సాధించాలంటే యాజమాన్యాలు ‘న్యూట్రల్’గా ఉండడం సాధ్యం కాదు. అలా ఉంటే ఎక్కువగా లాభాలు రావు. అందుకే యాజమాన్యాలు ఎంచుకున్న రంగులో ఆడతాయి. కొందరు యజమానులు పార్టీ కార్యకర్తలకంటే ఎక్కువగా పార్టీకి ప్రచారం చేస్తారు. ప్రతి పత్రిక యాజమాన్యం వెరైటీ.
తెలుగు రాష్ట్రాల్లో టిడిపి అనుకూల మీడియాగా ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఒకటి. ఇది ఎవరి ఆరోపణల వల్ల వచ్చిన పేరు కాదు. రెండు శాసనసభల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పత్రికలని బహిరంగంగానే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, టీవీ5లపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి తెరచాపగా టిడిపికి మద్దతు ఇచ్చిన పత్రికగా నిలిచింది. జగన్ ప్రభుత్వాన్ని ఉతుక్కుపోయినట్లు ఉతికేసింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు టిటిడి చైర్మన్ పదవి దక్కింది. కాస్త ఆలస్యంగా అయినా ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కూడా లైన్లోకి వచ్చారు. అయితే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ రాలేదు, కానీ మరో రకంగా లాభం లభించింది. ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. రాధాకృష్ణకు ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్పై 1.54 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రం నుంచి వచ్చే 15 సంవత్సరాల పాటు విద్యుత్ను ఏపీ సీపిడిసిఎల్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 2025 జూన్ 1 నుంచి యూనిట్కు ₹2.50 చెల్లిస్తారు. ఈ టారీఫ్ విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదని, అవసరానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.