ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రసంగంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన, నేషనల్ హైవేలు కూడా తన వల్లే వచ్చాయని విధంగా ప్రకటించారు. “హైదరాబాద్ కట్టింది నేనే, అమరావతి కడుతుంది నేనే, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్కు పంపించింది నేనే…” అంటూ గతంలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సరసన ఇప్పుడు “నేషనల్ హైవేలు కూడా నేనే తెప్పించా” అని జోడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “అటల్ బిహారీ వాజపేయి గారు ప్రధాని అయినప్పుడు, దేశానికి అవసరమవుతున్న అధునాతన రహదారి మౌలిక సదుపాయాలపై నేను సలహా ఇచ్చాను. నా సూచనల వలనే నేషనల్ హైవేల ప్రాజెక్టు అమలులోకి వచ్చింది. ఇది నా కోసమేమీ కాదు తమ్ముళ్లూ… మీ భవిష్యత్ కోసమే చేశాను” అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఈ విధంగా తన పాత్రను ప్రస్తావించడం కొత్తేమీ కాదు. తన పాలనలో జరిగిన ప్రగతిని ప్రస్తావించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే, ఒకవైపు ఆయన అభిమానులు మెచ్చుకుంటే, మరోవైపు ప్రత్యర్థులు మాత్రం ఆయనను ‘డబ్బా కొట్టే బాబు’ అని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు.
వాస్తవానికి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం (NHDP) 1998లో వాజపేయి ప్రభుత్వం ప్రారంభించింది. “గోల్డెన్ క్వాడ్రిలాటరల్” ప్రాజెక్టు ప్రధాన భాగం కాగా, దేశవ్యాప్తంగా రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. వాజపేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వం దీనిని అమలు చేసింది. చంద్రబాబు అప్పట్లో ఎన్డీయేకు మద్దతుగా ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు వెనుక తన పాత్ర ఉందని ఆయన చెబుతున్నారు. కానీ దీనిపై అధికారిక ధ్రువీకరణ ఎక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తన పాలన కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పునాది పనులు, సాంకేతిక ప్రోత్సాహం అంశాల్లో చంద్రబాబు ఎవరి క్రెడిట్ అయినా తన ఖాతాలో వేసుకుంటారు.. కానీ ప్రతీ ప్రాజెక్టును “నేనే చేసాను” అని చెప్పడం అవసరమా? లేక ప్రజలకు గుర్తు చేయాలనే తపనవా? ఇది సమాజానికి వదిలేయాల్సిన ప్రశ్న.