మనం కొనుగోలు చేసే కూరగాయల విషయంలోనూ ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. అవి పుచ్చాయా, ఏమైనా మరకలు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకుంటాం. అలాంటిది, మనల్ని పాలించే నాయకుల విషయంలో ఇంకెంత ఖచ్చితత్వంతో ఉండాలి? కానీ, దురదృష్టవశాత్తు, ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పట్ల రాజకీయ పార్టీలు ఎంత ఉదారంగా ఉంటున్నాయో కోట వినూత వ్యవహారం మరోసారి బహిర్గతం చేసింది.
సినిమా నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుందని, సచ్చీలత కలిగిన నాయకులే తన పార్టీలో ఉంటారని ప్రకటించింది. అయితే, వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి కోట వినూత వ్యవహారమే దీనికి బలమైన నిదర్శనం. ఆమె తన వద్ద పనిచేసిన శ్రీనివాసరాయుడు అనే డ్రైవర్ మరణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చంద్రబాబు కూడా జైలుకు వెళ్లారు. ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. రాజకీయంగా ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
జనసేన ప్రస్తుతం కూటమిలో భాగంగా ఉండటం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో సహజంగానే వైసీపీ ఈ కేసుపై దృష్టి సారించింది. మీడియా కూడా ఈ కేసు విషయంలో సంచలనాత్మక కథనాలను ప్రసారం చేస్తోంది. రాయుడి వ్యవహారంలో జనసేన శ్రీకాళహస్తి మాజీ ఇన్చార్జి వినూత, ఆమె భర్త చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ అనుకూల మీడియా ఇప్పటికే తేల్చింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి, శ్రీనివాసరాయుడు నానమ్మ, అతడి సోదరి అభిప్రాయాలను సేకరించింది. వారు చెప్పిన మాటల ప్రకారం, ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్కు తెలుసని, తన మనవడి ప్రాణాలు కాపాడాలని పవన్ కళ్యాణ్ కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డానని శ్రీనివాసరాయుడు నానమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. శ్రీనివాసరాయుడిని అవసరానికి వాడుకుని, అవసరం తీరాక అంతం చేశారని అతడి సోదరి ఆవేదన చెందుతోంది. వినూత చెప్పినట్లుగా తన సోదరుడి ఖాతాలో డబ్బులు లేవని, అతడికి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాసరాయుడు సోదరి చెబుతోంది.
మీడియా ప్రసారం చేసిన కథనాలలో శ్రీనివాసరాయుడు బంధువులు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి గనుక ఉంటే, ఈ కేసు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం కూడా కోరుతున్నారు. ఈ కేసును చెన్నై పోలీసులు మాత్రమే పరిష్కరించాలని శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వినూత చెప్పినట్లు ఈ కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రమేయం గనుక ఉండి ఉంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా కాకుండా, శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వినూత, ఆమె భర్త ప్రమేయం మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.