ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఎన్డీయే తరఫున రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
తెలుసుకున్న సమాచారం మేరకు రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష నేతలకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, ప్రతిపక్షం నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది. ఇవాళో రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.
ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ వైఖరి ఏంటన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. రాజ్నాథ్ సింగ్ అభ్యర్థనపై స్పందించిన జగన్ తన పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తుది నిర్ణయం ఏదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.