మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరూ పోటీపడినా, వ్యక్తిగతంగా వారిది అన్నదమ్ముల అనుబంధం. ఒకరి సినిమా విజయం సాధిస్తే మరొకరు అభినందించుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఇటీవల విడుదలైన ‘కుబేర’ సినిమా విజయోత్సవాల్లో చిరంజీవి పాల్గొని నాగార్జునను ప్రశంసించడం దీనికి తాజా ఉదాహరణ.
అయితే, ఇటీవల నాగార్జున నటించిన ‘కూలీ’ చిత్రంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన ‘సైమన్’ పాత్ర ముగింపు ఆయనకు నచ్చలేదని సమాచారం. నాగార్జున స్థాయికి, ఆయన స్టార్డమ్కి ఇలాంటి పాత్రలు సరిపోవని చిరంజీవి అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
చిరంజీవి ఏమన్నారంటే?
‘కూలీ’ సినిమాలోని నాగార్జున పాత్ర ముగింపును చూసి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసంతృప్తి చెందారని, ఆయన నాగార్జునతో “నువ్వు ఎంత పెద్ద సూపర్ స్టార్ వి, ఇలాంటి పాత్రలు నీకు తగవు. నాగార్జున విలన్ పాత్ర చేస్తున్నాడంటే అది చాలా పవర్ ఫుల్గా ఉంటుందని అనుకున్నాను. ఇలా ఉంటుందని ఊహించలేదు. దయచేసి ఇలాంటి పాత్రలు ఇకపై చేయకు. నా మీద గౌరవం ఉంటే చెయ్యవు” అని చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో నాగార్జున పాత్ర ముగింపుపై అక్కినేని అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. రజినీకాంత్ వంటి స్టార్ కూడా నాగార్జున పాత్ర ముగింపుపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రచిత రామ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర పాత్రలు నాగార్జున పాత్ర కంటే అద్భుతంగా ఉన్నాయనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది.
మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, సోషల్ మీడియాలో విశ్లేషకులు కూడా నాగార్జున ఈ మధ్య సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిరంజీవి అభిప్రాయాన్ని నాగార్జున పాటిస్తారా లేక తన మనసుకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి.