ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని బాధితురాలు ప్రీతి తల్లి పార్వతి దేవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
“న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతా” అని హెచ్చరించిన ఆమె, గిరిజనుల ఓట్లపై పవన్ కళ్యాణ్ చూపిన శ్రద్ధ.. వారి సమస్యలపై ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై జరిగిన అన్యాయంపై ఉద్యమం చేస్తామని కూడా ప్రకటించారు.
2017లో కర్నూలులోని రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాఠశాల యజమాని కుమారులపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినా, నిందితులు కేవలం 23 రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది.
పవన్ కళ్యాణ్ సాక్షాత్కారంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసుపై చేస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి ఆందోళనకు దిగుతున్న పరిణామం పెద్ద చర్చనీయాంశంగా మారింది.