ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ తాజాగా చానెల్ లో చర్చ పెట్టి తన ఆవేదనను.. అసహాయతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహారశైలి, టీడీపీ , జనసేన సోషల్ మీడియా వైఫల్యంపై ఆయన గంభీరంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా తన నేతలను రక్షించేందుకు ఎంతగా చురుగ్గా ఉంటుందో, అదే విధంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోందని అన్నారు.
వెంకటకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ , జనసేన సోషల్ మీడియా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు వచ్చిపడుతున్నా కూడా, జనసేన సోషల్ మీడియా ప్రతిస్పందన లేకుండా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే తరహాలో టీడీపీని కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నా, టీడీపీకి అనుకూలమైన సోషల్ మీడియా నిశ్శబ్దంగా ఉంటోందని ఆరోపించారు.
అదే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వ్యవస్థ పూర్తిగా దూకుడుగా ఉందని వెంకటకృష్ణ తెలిపారు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే, వెంటనే సోషల్ మీడియా అతనిని రక్షించేందుకు ముందుకు వచ్చి, విమర్శకులను తీవ్రమైన స్థాయిలో ట్రోల్ చేస్తోందని ఆయన అన్నారు. కిరణ్ రాయల్ జగన్ ను తిడితే ఊరుకోలేదని.. ఇప్పుడు ఆయన మహిళతో దొరికితే ఎంతగా ట్రోల్ చేసి ఆయన పరువు తీసిందో అర్థమవుతోందన్నారు. ఈ దెబ్బకు పవన్ కళ్యాణ్ ఏకంగా నోటీసులు ఇచ్చారంటే వైసీపీ సోషల్ మీడియా బలం ఏమేరకు ఉందో అర్థమవుతోందన్నారు.
ఈ పరిస్థితిని గమనిస్తే, రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు సమతుల్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. అభిప్రాయ స్వేచ్ఛను గౌరవిస్తూ, రాజకీయ విమర్శలకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను గెలిచాక ఆ రెండు పార్టీలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అర్థమవుతోంది.