ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో గుంటూరులో జరిగిన ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసుల విధులకు భంగం కలిగించారన్న ఆరోపణలతో అంబటిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది.
ఏకంగా సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు అంబటి రాంబాబు. అదే విషయాన్ని నల్లపాడు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. అంబటినీ బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని.. రిమాండ్ విధించకపోతే అంబటి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానంలో గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని చెప్పడంతో.. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే పోలీస్ కస్టడీలో తనపై పోలీసులు అమానుషంగా వ్యవహరించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అంబటి. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్ రిపోర్టులో అంబటి వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు ముప్పు ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబటి అరెస్టును రాజకీయ కక్షగా ఆరోపిస్తూ నిరసనలు చేపడుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారాయి.


