తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గుల పోటీలతో ఊరువాడ కళకళలాడాలి. కానీ, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. పండుగ పేరుతో నిర్వహించిన ‘రికార్డింగ్ డ్యాన్సులు’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీస్తున్నాయి.
చాలా చోట్ల స్థానిక నేతలు, ఉత్సవ కమిటీలు పండుగ వినోదం పేరుతో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు చేయించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్ధనగ్న ప్రదర్శనలు, ద్వంద్వార్థాలు వచ్చే పాటలతో సాగిన ఈ కార్యక్రమాలు చూస్తుంటే, ఇది మన సంస్కృతేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఓట్ల కోసం లేదా తమ బలాన్ని చాటుకోవడం కోసం కొందరు నాయకులు భారీ స్థాయిలో డబ్బు వెచ్చించి ఇలాంటి అశ్లీల ప్రదర్శనలను ప్రోత్సహించడం గమనార్హం.పవిత్రమైన పండుగ రోజున కుటుంబ సమేతంగా చూడలేని విధంగా సాగిన ఈ డ్యాన్సులు యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.ఈ డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు “ఏంటీ గలీజు పని?” అంటూ మండిపడుతున్నారు.
“సంక్రాంతి అంటే మన మూలాలను గుర్తు చేసుకునే పండుగ. కానీ, ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు తీసుకువచ్చి పండుగ విలువను తగ్గించడం దారుణం” అని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
వినోదం ఉండాలి, కానీ అది వికృతంగా మారకూడదు. కళ పేరిట అశ్లీలతను పండించడం మన తెలుగు సంప్రదాయానికి గొడ్డలి పెట్టు. రాజకీయ నాయకులు, ఉత్సవ నిర్వాహకులు ఇకనైనా మేల్కోవాలి. పండుగలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోకుండా, మన సంస్కృతిని తర్వాతి తరానికి అందించేలా ప్రదర్శనలు ఉండాలి. ఇలాంటి ‘గలీజు’ సాంప్రదాయాలకు స్వస్తి పలికినప్పుడే సంక్రాంతికి నిజమైన శోభ వస్తుంది.
https://x.com/IamPRVChAnduBRS/status/2011818995054514424?s=20


