ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నారా వారి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సాధారణంగా రాజకీయ విమర్శలు, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభలో, కేవలం పొగడ్తలకే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన ప్రసంగంలో నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను కొనియాడటమే కాకుండా, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రస్తావించారు. లోకేష్ నుంచి మొదలుకొని చిన్నారి నారా దేవాన్ష్ వరకు, ఆ కుటుంబ సభ్యులు సాధించిన రికార్డులను, వారి సేవా కార్యక్రమాలను సభలో ఏకరువు పెట్టారు.
అటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఇటు క్షేత్రస్థాయి ఎమ్మెల్యేల వరకు అందరూ అధికార తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా కుటుంబానికి ‘కొమ్ము కాస్తున్నారని’ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత పొగడ్తలకే అసెంబ్లీ సమయాన్ని కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
https://x.com/greatandhranews/status/2021849761767452674?s=20


