ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నప్పటికీ కీలక రాజకీయ కేసుల కోసం లూథ్రాకు కోట్లలో ఫీజులు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ఫీజుల చెల్లింపుల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం ప్రభుత్వం మరో రూ.1.15 కోట్లను ఫీజులుగా చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రెండు జీవోలు జారీ చేశారు.
మద్యం అక్రమ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు రూ.65 లక్షలు.. మద్యం అక్రమ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్కు సంబంధించిన కేసు వాదనలకు రూ.50 లక్షలు చెల్లించారు.
ప్రజాధనాన్ని లూథ్రాకు భారీగా దోచిపెడుతున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు తీవ్ర అవస్థలు పడుతున్న రైతులు, ప్రజల బాగోగులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
“మొంథా తుఫాన్ దెబ్బకి నష్టపోయిన రైతులకు రూపాయి ఇవ్వలేదు కానీ… లూథ్రాకు మాత్రం కోట్లు దోచిపెడుతున్నారు కదా” అంటూ ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, కానీ న్యాయవాది ఫీజుల కోసం మాత్రం తక్షణమే కోట్లను విడుదల చేస్తోందని వారు మండిపడుతున్నారు.
ప్రభుత్వ అడ్వకేట్లు ఉన్నప్పటికీ, కీలక కేసుల కోసం ప్రైవేట్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ప్రజాధనాన్ని ఇలా కోట్లలో చెల్లించడంపై ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా సంక్షేమం కంటే ముఖ్యమంత్రి వ్యక్తిగత కేసులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
https://x.com/JaganannaCNCTS/status/1993163627990597713?s=20


