ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న ప్రకటనలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా ‘సుడిగుండంలో’ చిక్కుకుందని, ఖజానా ఖాళీగా ఉందని, కేంద్రం అప్పులు ఇవ్వడం లేదని ఆయన ఒకవైపు చెబుతున్నారు. అయితే, కొద్ది రోజులకే మరో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, రాష్ట్రం 11.28% జీఎస్డీపీ (GSDP) వృద్ధి రేటును సాధించిందని, ఆర్థిక వ్యవస్థ ‘భేష్’గా ఉందని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
‘సూపర్సిక్స్’ హామీలు అమలు చేయాలని ఉన్నా నిధులు లేవని చెబుతున్న సీఎం, అదే సమయంలో అధిక వృద్ధి రేటు సాధించామని చెప్పడం వైరుధ్యంగా ఉంది.గత ఏడాదిన్నర కాలంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసిన విషయాన్ని దాచిపెట్టి, అంతా బాగానే ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.జీఎస్డీపీ వృద్ధికి కారణాలుగా ఆయన చూపిన అంశాలైన ఆక్వా విద్యుత్ రాయితీ, పోర్టుల అభివృద్ధి వంటివి గత ప్రభుత్వ హయాంలో మొదలైనవేనని విమర్శకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు నాయుడు ‘అంకెల గారడీ’ చేస్తున్నారని, ప్రజలను మోసం చేసేందుకే సొంత లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. కాగ్ (CAG) గణాంకాల ఆధారంగా చూసినా, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాలలోనూ తమ పాలనతో పోలిస్తే తీసికట్టుగా ఉందని ఆయన రుజువు చేశారు.
ప్రభుత్వం నిజమైన ఆర్థిక పరిస్థితిని పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలని, కేవలం గణాంకాలతో మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

